వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మహా కూటమికి ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ నాయకత్వం వహిస్తారని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెల్లడించారు. బీహార్ గ్రాండ్ అలయెన్స్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం మంగళవారంనాడు జరిగింది. ఈ సమావేశానికి ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, లెఫ్ట్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ప్రకటన చేశారు. తన తర్వాత ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మహాకూటమికి నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు.
2025 బీహార్ ఎన్నికలు తేజస్వి నాయకత్వంలో జరగనున్నాయని ఆయన తెలిపారు. బీజేపీని ఓడించడమే తన లక్ష్యమని నితీశ్ అన్నారు. ప్రధాని పదవి కోసం కాకుండా బీజేపీని గద్దె దించేందుకు ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇది చాలా సులభం. ఇది సాధ్యం కూడా అవుతుంది అని ఆయన అన్నారు. కుధాని ఉపఎన్నికలో ఓటమి తర్వాత జేడీయూకి ఆర్జేడీ మద్దతివ్వలేదని అందువల్లే ఓటమి సంభవించిందని ఈ కారణంగా మహాకూటమిలో విభేదాలు తలెత్తాయని ఊహాగానాలు వచ్చాయి.
అయితే అలాంటివేం లేవని మహాకూటమి సమావేశం తేల్చి చెప్పింది. ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తున్న సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మెహబూబ్ ఆలం మాట్లాడుతూ.. తేజస్విని చూపిస్తూ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పారు. ఆయన నాయకత్వంలోనే 2025 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న మతతత్వ శక్తులతో పోరాడుతున్నమని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని క్యాబినెట్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. భవిష్యత్తు తేజస్వి లాంటి యువకులదేనని ముఖ్యమంత్రి కొంతకాలంగా చెబుతున్నారని అన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నప్పటికీ జేడీ(యూ)ని ఓడించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు పరస్పరం చేతులు కలపడానికి అంగీకరిస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించవచ్చని ఆయన పునరుద్ఘాటించారు.