కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుకు బాసటగా నిలిచిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
నూతన చైర్మన్ వడ్తియా సెట్ రాం నాయక్, వైస్ చైర్మన్, 12 మంది డైరెక్టర్ లు మంత్రి పువ్వాడ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పంట చేతికి రావడంతో ఏమి చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతాంగాన్ని ఆదుకుంది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు.
ధాన్యం చేతికోచ్చిన సమయంలో ఊరురా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే సాహసోపేత నిర్ణయానికి నాంది పలికి విజయవంతంగా పంటలను ఎక్కడికక్కడే కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి పంటలు కొని ప్రతి పైసాను రైతుల ఖాతాలలో వేశామని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతు రాజ్యాన్ని నెలకొల్పేందుకు చేపట్టిన సాహసోపేతమైన చర్యల్లో భాగంగానే ఒకప్పుడు మనం పక్క రాష్ట్రాల నుండి పంటలను దిగుమతి చేసుకుని స్థాయి నుండి నేడు మనమే పంటలు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని నేడు తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ గా ఆ కీర్తిని సాధించుకున్నామని అన్నారు.
యాసంగి పంటల దిగుబడిలో యావత్ తెలంగాణ రాష్ట్రం లోనే ఖమ్మం జిల్లా సింహభాగంలో నిలవడం గర్వకారణమన్నారు. నీటి విడుదల వల్ల ఖమ్మం జిల్లాలోని 2.54 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు భూములకు సరిపడు సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు.
జిల్లాలో వానాకాలం పంటల సాగుకు 24.611 టీఎంసీలు కేటాయించారని, వార బందీ విధానంలో కాలువలకు నీటిని విడుదల చేసి, ఆయకట్టు చివరి భూములకు సైతం నీటిని అందించడం ఇప్పటి వరకు జరగలేదన్నారు.