ఆర్థిక ప్రయోజనాల కోసమే చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబులు చిత్రపరిశ్రమ పేరు చెప్పుకుని ఎపి ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారని కడప జిల్లా రాష్ట్ర బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు అన్నారు. అభిమానులను అడ్డుపెట్టుకొని కోట్లు గడించడం తప్ప వారి బాగోగులు పట్టించుకోరా అని ఆయన ప్రశ్నించారు.
ఈ సినిమా హీరోలకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పట్టవా అని ఆయన ప్రశ్నించారు. స్వర్గీయ ఎన్టీఆర్, ఎన్నార్ ,దాసరిలో ఉన్న తెగువ దమ్ము మీకు లేవా అని ఆయన నిలదీశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు, ఉద్యమ నేతలకు సంఘీభావం తెలిపే ధైర్యం లేని ఈ హీరోలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
అలా చేస్తే వారి ఆర్థిక ప్రయోజనాలు దక్కవనా లేక జగన్మోహన్ రెడ్డి అంటే భయమా అని ఆయన నిలదీశారు. అమరావతి రాజధాని కోసం 175 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నారని వారికి ఇంతవరకు కౌలు కూడా ఇవ్వలేదని రమేష్ నాయుడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ని కలిసిన సినీ పెద్దలు మన రాజధాని ఏది అని అడగాల్సిందని రమేష్ నాయుడు అన్నారు.