మూడు లక్షల రూపాయల గృహలక్ష్మి పథకం కోసం మహిళలు ముప్పు తిప్పలు పడుతున్నారు. దరఖాస్తులకు మూడ్రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో తహసీల్దార్ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. చాలా మంది మహిళలకు ఆదాయ సర్టిఫికెట్ లేకపోవడంతో ఇప్పటికిప్పుడు దానిని తెచ్చేందుకు తంటాలు పడుతున్నారు.
కొన్ని మండలాల్లో తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. సకాలంలో సర్టిఫికెట్లు ఇవ్వకపోతే తమకు లబ్ది చేకూరు తుందో లేదోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అధికారులు మాత్రం అందు బాటులో ఉన్న ధ్రువీకరణలతో దరఖాస్తు చేస్తే సరిపోతుందని, విచారణ సమయం నాటికి నిర్దేశిత సర్టిఫికెట్లు పొందాలని చెబుతున్నారు.
మరోవైపు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియని దరఖాస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని’ ప్రకటించారు. అయినప్పటికీ దరఖాస్తుదారుల్లో టెన్షన్ తగ్గడం లేదు. సకాలంలో దరఖాస్తు చేయకపోతే తమను ఎక్కడ అనర్హులుగా పరిగణిస్తారోనని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. గడువు పెంచాలని రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆందోళనలు జరుగుతున్నాయి. గడువు అంటూ ఏమీ లేదని, ఇదొక నిరంత ప్రక్రియ అని అధికారపక్ష వర్గీయులు అంటున్నారు.