వరంగల్ లోని మామునూరు ఎయిర్ పోర్టును ఉడాన్ పథకంలో చేర్చి, విమానయాన సేవలు ప్రారంభించేలా కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటిఆర్ కు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ సత్యవతి రాథోడ్ కృతజ్ణతలు తెలిపారు.
మామునూరు ఎయిర్ పోర్టును ఆపరేషన్ లోకి తీసుకురావాలని కోరుతూ ఢిల్లీలో కేటిఆర్ కేంద్ర పౌర విమానయాన, పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి విజ్ణప్తి చేయడం, దానికి 10 రోజుల్లో ఇందుకోసం సర్వే చేయిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇవ్వడం ఓరుగల్లు వాసులకు శుభవార్త అన్నారు.
ఓరుగల్లు నుంచి విమానయాన సేవలు ప్రారంభించేందుకు సర్వే చేయించేందుకు హామీ ఇవ్వడం పట్ల కేంద్ర మంత్రికి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో మిగిలిన ఐదు చోట్ల ఎయిర్ పోర్టులపై సర్వే చేస్తున్నప్పటికీ మామునూరులో రన్ వే ఉండడంతో త్వరలో ఓరుగల్లులో విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ వరంగల్ పై ప్రత్యేక ప్రేమతో హైదరాబాద్ తర్వాత ఓరుగల్లును అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని, ఇటీవలే కురిసన భారీ వర్షాల నేపథ్యంలో కూడా సిఎం కేసిఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటిఆర్ వరంగల్ లో పర్యటించి ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కల్పిస్తానని హామీ ఇవ్వడం పట్ల ఈ ప్రభుత్వానికి వరంగల్ నగరం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
వరంగల్ లో విమానయాన సేవలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయి, వసతులున్న నగరంగా బాసిల్లుతుందని, ఇది ఓరుగల్లు అభివృద్ధిలో కీలక ఘట్టంగా మారుతుందని పేర్కొన్నారు.