ఈ నెల 19 న బీజేపీ బస్సు యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభం కానుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యెండల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీ బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి ప్రారంభం కానున్న ఈ యాత్రను కోమురం భీం యాత్రగా పిలువబడుతుందని తెలిపారు. 29 నియోజకవర్గాలలో 19 రొజుల పాటు 1100 కిలోమీటర్లు కొనసాగుతుందన్నారు.ప్రతి ఉమ్మడి జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, ఈ సభకు జాతీయ నాయకులు హాజరవుతారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడమే ఈ యాత్ర ఉద్దేశ్యమన్నారు. ఈ యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి విజయవంతం చేయాలని కోరారు. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలలో కేసిఆర్ ఓటమి ఖాయమన్నారు. పోలీసులు, అధికారుల చేత ప్రజలను భయందోళనకి గురి చేస్తున్నారన్నారు.
బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కామన్ ఫ్రెండ్ ఎంఐఎం పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని తెలిపారు. రాష్ట్రంలో ఇంటలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ నాయకుల గెలుపు కోసం పని చేస్తుందన్నారు.