కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం తీవ్ర రూపం దాల్చింది. కర్ణాటకలోని బెలగావిలోని బాగేవాడి వద్ద మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమంలో కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు మహారాష్ట్రకు చెందిన ట్రక్కులపై రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ఉద్రిక్తత భయంతో, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మంత్రులు బెళగావి పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా, రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై చెప్పారు. బాగేవాడి వద్ద కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు మహారాష్ట్ర నంబర్ ప్లేట్లు ఉన్న ట్రక్కులను అడ్డుకున్నారు. ఓ ట్రక్కుపై రాళ్లు రువ్వారు. కార్మికులు కూడా హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్రతో సరిహద్దు వివాదం పెరుగుతున్న నేపథ్యంలో, సామరస్యానికి భంగం కలిగించవద్దని ఇరు రాష్ట్రాల ప్రజలను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కోరారు. రాష్ట్ర సరిహద్దుల్లో, ఇతర రాష్ట్రాల్లో కన్నడ మాట్లాడేవారి ప్రయోజనాలను పరిరక్షించడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. సరిహద్దు వివాదంపై న్యాయపోరాటంలో కర్నాటక విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని, రాష్ట్ర వైఖరి చట్టబద్ధంగానూ,
రాజ్యాంగబద్ధంగానూ ఉందని బొమ్మై అన్నారు. న్యాయ పోరాటంలో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. కాబట్టి దీనిని ఎన్నికలకు సమస్యగా మార్చే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దులను, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళలో నివసిస్తున్న తమ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలని తాము నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు.
కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు, సరిహద్దు వివాదానికి ఎలాంటి సంబంధం లేదని బొమ్మై స్పష్టం చేశారు. మహారాష్ట్ర చాలా ఏళ్లుగా ఈ అంశాన్ని లేవనెత్తుతోంది. బెలగావి పర్యటన సరిహద్దు జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున, తన మంత్రివర్గ సహచరులను బెలగావి సందర్శించకుండా ఆపాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కోరనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సోమవారం తెలిపారు.