లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు నిత్యావసర సరకులు అందచేస్తే వాటిని మావోయిస్టులు దౌర్జన్యం చేసి లాక్కోవడం హేయమైన చర్య అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్ పి సునీల్ దత్ అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా గుత్తికోయ ప్రజలను మావోయిస్టులు ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధాకరమని ఆయన అన్నారు.
లాక్ డౌన్ కారణంగా ఎలాంటి పనులు లేక, నిత్యావసరాలు దొరకక ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు ప్రభుత్వం అందిస్తున్న వస్తువులను బెదిరించి తీసుకోవడం వలన గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎస్ పి అన్నారు.
చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మాత్రమే కాకుండా చర్ల మార్కెట్ పై ఆధారపడే చత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన పూజారి కాంఖేర్ లాంటి గుత్తికోయ గ్రామాలలో మావోయిస్టులు ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.
లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి పోలీసు వారు గుత్తి కోయలకు నిత్యావసరాలను అందిస్తున్నారు. మావోయిస్టులు పోలీసు వారు అందిస్తున్న నిత్యావసర వస్తువులను బలవంతంగా లాక్కొంటున్నారు. మావోయిస్టులు గిరిజనులకు కలుగజేసే ఇబ్బందులు గురించి మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతున్నదని ఆయన వివరించారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్ పి అన్నారు.