రూ. 3 లక్షల విలువైన 5 తులాల బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల కు చెందిన కృష్ణవేణి ఆభరణాలను శ్రమించి కేవలం గంటలోపే బాధితురాలికి అందచేసి శభాష్..పోలీస్..అంటూ మన్ననలందుకున్నారు జమ్మలమడుగు అర్బన్ సి.ఐ సదాశివయ్య, సిబ్బంది. సంబంధిత పోలీసులను కడప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ అభినందించారు. 26న శనివారం నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం టి.ఎన్ పల్లి గ్రామానికి చెందిన మహిళ జి.
కృష్ణవేణి కుటుంబంతో కలిసి షాపింగ్ చేసేందుకు జమ్మలమడుగు పట్టణానికి వచ్చారు. ఈ క్రమంలో చెందిన రూ. 3 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగ్ ను పోగొట్టుకున్నారు. దీంతో జమ్మలమడుగు అర్బన్ సి.ఐ యు.సదాశివయ్యను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తక్షణం స్పందించిన అర్బన్ సి.ఐ సదాశివయ్య, కానిస్టేబుళ్లు మధుసూదన్ రెడ్డి, ఈశ్వరయ్య, రియాజ్ అహమ్మద్ లతో రంగంలోకి దిగి పట్టణంలోని తాడిపత్రి బస్ స్టాప్ వద్ద క్షుణ్ణంగా గాలించారు.
సి.సి కెమెరాలను పరిశీలించారు. బంగారు ఆభరణాలున్న బ్యాగ్ ను వెదికి బాధితురాలు కృష్ణవేణికి అందచేసి జమ్మలడుగు అర్బన్ సి.ఐ సదాశివయ్య, సిబ్బంది శెభాష్..పోలీస్ అంటూ ప్రజల మన్ననలందుకున్నారు. విలువైన నగలతో కూడిన బ్యాగును సురక్షితంగా తనకు అందచేసినందుకు జమ్మలమడుగు అర్బన్ సి.ఐ సదాశివయ్య, సిబ్బంది కి బాధితురాలు కృష్ణవేణి కృతజ్ఞతలు తెలిపారు.
తక్షణం స్పందించి రూ. 3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును బాధితులకు అందచేసేందుకు శ్రమించిన అర్బన్ సి.ఐ సదాశివయ్య, కానిస్టేబుళ్ళు మధుసూదన్ రెడ్డి, ఈశ్వరయ్య, రియాజ్ అహమ్మద్ లను జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ అభినందించారు.