యూపీ పోలీసుల ఎన్కౌంటర్లో గ్యాంగ్స్టర్, రాజకీయ నేత అతిఖ్ అహ్మద్ కుమారుడు హతమయ్యాడు. న్యాయవాది ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడైన అతడితోపాటు మరొకరు కూడా చనిపోయారు.ఉత్తర్ప్రదేశ్ గ్యాంగ్స్టర్, రాజకీయ నేత అతిఖ్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఝాన్సీలో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్తో జరిగిన కాల్పుల్లో అతడు మరణించాడు.
అసద్తోపాటు గులామ్ అనే మరొక వ్యక్తి కూడా ఎన్కౌంటర్లో చనిపోయాడు. ప్రయాగ్రాజ్కు చెందిన న్యాయవాది ఉమేశ్ పాల్ హత్య కేసులో వీరిద్దరిపై రూ.5లక్షలు చొప్పున రివార్డు ఉంది. మృతుల నుంచి అధునాతన విదేశీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉమేశ్ పాల్ కిడ్నాప్ కేసులో అతిఖ్ అహ్మద్కు ఇప్పటికే జీవిత ఖైదు పడింది. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నాడు. ఉమేశ్ పాల్ హత్య కేసుకు సంబంధించి అతిఖ్ను, అతడి సోదరుడు అష్రఫ్ను ప్రయాగ్రాజ్లోని కోర్టుకు తీసుకువచ్చారు. వారు న్యాయస్థానంలో ఉండగానే అసద్ ఎన్కౌంటర్ సమాచారం తెలిసింది. వెంటనే అతిఖ్ కోర్టులోనే తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు తెలిసింది.