37.2 C
Hyderabad
May 6, 2024 22: 40 PM
Slider ఖమ్మం

ఫిబ్రవరి మాసాంతానికి లక్ష్యం అందుకోవాలి

#collector

విద్యా ప్రమాణాల పెంపుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో మండల విద్యాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తొలిమెట్టు నోడల్ అధికారులతో తొలిమెట్టు, పదో తరగతి పబ్లిక్ పరీక్షలు, క్రీడా గ్రాంట్ వినియోగం, పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్, పాఠశాల నిర్వహణ కమిటీలకు చెల్లింపులు, అభ్యాస దీపికల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్దేశిత లక్ష్యాల సాధనకు ప్రధానోపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ధ తో కృషి చేయాలన్నారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుకు చేపట్టిన తొలి మెట్టు కార్యక్రమంలో సూచించిన స్వల్పకాలిక లక్ష్యాలను ప్రతి ఒక్క విద్యార్థి సాధించేలా కార్యాచరణ చేయాలన్నారు. ఫిబ్రవరి మాసాంతానికి ఏర్పరచిన లక్ష్యం ప్రతి ఒక్క విద్యార్థి అందుకోవాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అదనపు తరగతులు తీసుకొని, వారి విద్యా ప్రమాణాలు పెంపొందించాలని ఆయన తెలిపారు. తరగతి గదిలో సంభాషణ ఇంగ్లీషులోనే చేయాలని, దీంతో పిల్లలకు ఇంగ్లీష్ లో మాట్లాడడం సులువుగా వస్తుందని ఆయన అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద పూర్తయిన పనులకు నిధులు విడుదల అయ్యాయని, పాఠశాల నిర్వహణ కమిటీలకు వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పనులు పూర్తయిన పాఠశాలల్లో పెయింటింగ్ పనులు చేపట్టి, పూర్తి చేయాలని అన్నారు.

ప్రధానోపాధ్యాయులు మన ఊరు-మన బడి కార్యాక్రమ బాధ్యతలు తీసుకోవాలని అన్నారు.  అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించాలని ఆయన తెలిపారు. పదో తరగతి గత సంవత్సర ఫలితాలు, ఈ సంవత్సరం ప్రి ఫైనల్ ఫలితాలపై పాఠశాలల వారిగా కలెక్టర్ సమీక్షించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ చేయాలన్నారు. ఫలితాల్లో వెనుకబడిన పాఠశాలలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, సందర్శనలు చేసి పర్యవేక్షణ చేయాలని ఆయన తెలిపారు. వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకొని, ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అభ్యాస దీపికల పంపిణీ వంద శాతం చేయాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలన్నారు. క్రీడా గ్రాంట్ పాఠశాలలకు మంజూరు అయినట్లు, క్రీడలకు సంబంధించి ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల ఆసక్తిని బట్టి క్రీడాపరికరాల కొనుగోలు చేయాలన్నారు. క్రీడా గ్రాంటును ఇతర అవసరాలకు వాడొద్దని కలెక్టర్ తెలిపారు. పాఠశాలల్లో ఆన్యువల్ డే, హాస్టళ్లలో హాస్టల్ డే నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. విద్యతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అదనపు పాఠ్య ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, ఇఇ నాగ శేషు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గంజాయి సాగు లేదు….కానీ స‌ర‌ఫ‌రాకు యువ‌కుల‌ను వాడుకుంటున్నారు….!

Satyam NEWS

మాటలు వద్దు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పండి

Satyam NEWS

ఒకే గొడుగు కిందకు మొత్తం నీటిపారుదల శాఖ?

Satyam NEWS

Leave a Comment