ఇంటి ముందు వేసిన ముగ్గు విషయంలో జరిగిన గొడవకు ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన పాతబస్తీలోని ఛత్రినాక పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలోని ఛత్రినాక పీఎస్ పరిధిలోని శివాజీ నగర్ ప్రాంతంలో మాణి క్ ప్రభు తల్లి తన ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్లింది.
కాసేపటి తర్వాత.. పక్కనే నివాసం ఉంటున్న దుర్గేష్ ఇంటి నుంచి నీరు రావడంతో మాణిక్ ప్రభు తల్లి వేసిన ముగ్గు కొట్టుకుపోయింది. దీంతో మాణిక్ ప్రభు పక్కింటివారితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో రెండు కుటుంబాల వారు పిడిగుద్దులు గుద్దుకుంటూ దాడి చేసుకున్నారు.
ఘర్షణలో తీవ్రంగా గాయపడిన మాణిక్ ప్రభు(35) ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే క్రమంలో చనిపోయాడు. ఈ మేరకు ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.