కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. వరుస దోపిడీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వరుస దొంగతనాలు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే రోజు మూడు ఇళ్ళల్లో భారీ దొంగతనాలు చోటు చేసుకున్నాయి.
సుమారు 47 తులాల బంగారం, 30 తులాల వెండి, లక్ష నగదు వరకు దుండగులు దోచుకెళ్లారు. వరుసగా జరిగిన ఈ దొంగతనాలతో పట్టణ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉండే ముజీబోద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో 10 తులాల బంగారం, 50 వేల నగదును దోచుకెళ్లారు. సంబంధిత కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఈ ఘటన చోటు చేసుకుంది.
పంచముఖి హనుమాన్ కాలనీలోని పిట్ల రాము ఇంట్లో 35 తులాల బంగారం, 22 తులాల వెండి ఆభరణాలతో పాటు కొంత నగదును దోచుకెళ్లారు. ఈ ఇంటి పెద్ద ఇటీవల మృతి చెందడంతో వారు వేరే ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇదే కాలనీకీ చెందిన రవి ఇంట్లో 2 తులాల బంగారం, 8 తులాల వెండి ఆభరణాలు, 25 వేల నగదును ఎత్తుకెళ్లారు.
ఈ మూడు దొంగతనాలు ఒకేరోజు కావడం గమనార్హం.. ఇటీవల బిబిపేట మండలం పిట్లం మండలాల్లో ఇదే తరహాలో దొంగతనాలు జరిగాయి. అక్కడి దొంగల ముఠానే ఇక్కడికి వచ్చి చోరీలకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.