అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మళ్ళీ దోపిడికి గురి చేసేందుకు మాయగాళ్లు వస్తున్నారని, వారి మాయ మాటలు నమ్మి తే ఇక్కడి నీరు.. కరెంటును… బొగ్గు దోపిడీ చేసి మళ్లీ తెలంగాణను గుడ్డి దీపంగా మారుస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ నియోజకవర్గం లోని కొత్తపల్లి మండలం, కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…కరీంనగర్ నాటి సమైక్య పాలనలో పాలకుల వివక్షకు గురైందని, నిధులు రాక అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని అన్నారు. ఇప్పుడు స్వయం పాలనలో వందలాది కోట్లతో నగరంలో ఏ వాడని చూసినా అభివృద్ధి పనులు జరుగుతూ కనిపిస్తున్నాయని అన్నారు. సమైక్య పాలనలో తాగునీరు కావాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కే పరిస్థితులు ఉండేవని, నేడు స్వయం పాలనలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి జలాన్ని అందిస్తున్నామని అన్నారు.ఎన్నికలు సమీపిస్తుంటే విపక్షాల నాయకులు మాయ పాటలు చెప్పేందుకు వస్తున్నారని వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలమ్మకు తెలంగాణలో ఏం పని… ఇక్కడి పాదయాత్రలు ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. దొంగల మాటలు నమ్మొద్దని, మన కేసీఆర్ ప్రభుత్వానికి మనం అండగా ఉందామని,సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవెనలు అందించాలని కోరారు.
ఆడబిడ్డల కండ్లలలో ఆనందం కలిగించాలనే ధ్యేయంతో పేదలు, నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మానవతకు మారుపేరని అన్నారు. ప్రపంచంలో ఎక్కడలేని విధంగా కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ పథకం ను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఏ దేశంలో, రాష్ట్రంలో ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గాని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకాలను అమలు చేయడం లేదన్నారు.
ఆడబిడ్డల కండ్లలలో ఆనందం కలిగించాలనే ధ్యేయంతో ఆడబిడ్డలను తెలంగాణ ఆస్తిగా భావించి పేదలు, నిరుపేద ఆడబిడ్డల పెండ్లిలకు లక్ష రూపాయలు కట్నంగా కెసిఆర్ గారు అందిస్తు మానవతకు మారుపేరుగా నిలిచారన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు కెసిఆర్ కిట్, ఆసరా పింఛన్లు, ఉచిత విద్య, కరెంటు రైతుబంధు రైతు బీమా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గతంలో ప్రక్కనే మానేరు ఉన్న త్రాగు నీటి కోసం ఇబ్బందులు పడ్డామన్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కరెంటు, నీటికి ఇబ్బంది లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అన్ని చెరువులు నింపడం వల్ల సమృద్ధిగా నీళ్లు ఉన్నాయన్నారు. గతంలో పనిచేసిన ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధి కోసం పట్టించుకోలేదని అన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొత్తపల్లి మండలంలోని 47 మంది లబ్ధిదారులకు, కరీంనగర్ అర్బన్ లోని 291, కరీంనగర్ రూరల్ మండలంలోని 32 మంది లబ్ధిదారులకు 3 కోట్ల 70 లక్షల42 వేల920 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ప్రతి లబ్ధిదారునికి చెక్కుతో పాటు మంత్రి చీరను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణి – హరి శంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కరీంనగర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు