తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతున్న విషయం తెలిసిందే.కాగా, రానున్న మూడురోజుల్లో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
ఇది మరింత తీవ్రమై వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.