మహిళల మెడల నుండి బంగారు గొలుసులు దొంగిలించే ముగ్గురు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ కు తరలించినట్లు మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు తెలిపారు. సీఐ నర్సింహా రావు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి సాగర్ నేత పురం గ్రామానికి చెందిన సండ్రాల అశోక్, నాగనబోయిన కోటి, కడియాల బావ్ సింగ్ లు ముగ్గురు స్నేహితులు. వ్యసనాలకు, బెట్టింగ్ లకు బానిసలుగా మారిన ముగ్గురు గత కొంత కాలంగా వేర్వేరు పనులు చేస్తూ పట్టణంలోని శాంతి నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారు సంపాదించే డబ్బులు సరిపోక సులభంగా డబ్బులు సంపాదించాలనే దొంగతనాలకు దిగారు.
ఇదే అదనుగా శ్రీనిధి కాలనీలో కిరాణా షాపు నడిపిస్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు గుర్తించి మూడు రోజుల పాటు రెక్కి చేశారు. ఈ నెల 4న పల్సర్ బైక్ పై షాప్ దగ్గరికి వెళ్లి సిగరెట్ కావాలని అడగ్గా షాప్ లోకి వెళ్తున్న మహిళ మెడ మీద ఉన్న మూడు తులాల బంగారు గొలుసు లాక్కొని బైక్ పై పారిపోయినారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అద్దె గదిలో నివాసం ఉన్న ముగ్గురిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వీరి నుండి రూ. 1.2 లక్షల విలువ చేసే బంగారు గొలుసు, పల్సర్ బైక్, మూడు సెల్ ఫోన్ లు స్వాధీన పర్చుకున్నట్లు పేర్కొన్నారు. కేసును చేధనలో ప్రతిభ చాటిన సీఐ నరసింహ రావు, ఎస్సై ఎస్. కృష్ణయ్య, హెడ్ కానిస్టేబుల్ పి. వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ కే. నరేష్ కుమార్, ఎం. రామకృష్ణ, డి. రాగ్య నాయక్, పి. ధనుంజయ, కే. కళ్యాణ్, ఎం. నాగేశ్వర రావు లను మిర్యాలగూడ డిఎస్పి వెంకట గిరి అభినందించారు.