వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణల్లో అధికార పార్టీ కుట్రకోణం వుందని టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముక్కెర రాజు అన్నారు. ప్రశ్నిస్తే కక్ష సాధింపు కెసిఆర్ నైజం అని ఆయన అన్నారు.
ఈటెల పై విచారణకు ఆదేశించడం పై ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అదే సమయంలో ఇంతకాలంగా ప్రభుత్వ, అసైన్డ్, సర్ఫేఖాజ్, ఇనాం, వక్ఫ్ భూములను కబ్జా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా వెంటనే విచారణ కు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేసారు. ఇప్పటికే అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల పైన భూ కబ్జా ఆరోపణలు వచ్చినా కేసీఆర్ స్పందించకపోవడం వెనుక వున్న ఆంతర్యాన్ని ప్రజలు గమనిస్తూనే వున్నారని ఆయన పేర్కొన్నారు.
టీఆరెస్ అగ్ర నాయకులు మల్లారెడ్డి, మహేందర్ రెడ్డి,మంచిరెడ్డి, పువ్వాడ అజయ్ లపై వచ్చిన ఆరోపణలతో పాటు మియాపూర్, హఫీజ్ పేట్, భూ కుంభకోణంల విషయంగా ఇంత వరకు తీసుకున్న చర్యలేమిటో వివరించాలన్నారు.
నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత బయట పడిన వేల కోట్ల రూపాయలు, బంగారం, భూముల విచారణ ఏమైంది? ఈ విచారణను ఎందుకు నీరుగార్చారు? ఈ బంగారం, రూపాయలు, భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయనేది ప్రజలకు వివరించాలన్నారు.
ఇవేవీ పార్టీ అంతర్గత వ్యవహారం కాదని, రాజకీయ ఆధిపత్యాల కోసం ప్రజల్ని తప్పుదారి పట్టించడం ముఖ్యమంత్రి ప్రజాస్వామిక స్ఫూర్తి కి విరుద్ధమని అన్నారు. ఇప్పటికైనా ఈటల రాజేందర్ నిజమైన ఉద్యమ కారులతో కలిసి ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షల కోసం ఉద్యమించాలని రాజు అన్నారు.