బీజేపీతో పొత్తు గురించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పునరాలోచించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన కొద్దిసేపటి తర్వాత రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీజేపీ ఓటమికి, ఓట్ల శాతాన్ని గణనీయంగా తగ్గించి బీజేపీ కి తగిన గుణపాఠం చెప్పడం లో నవతరం పార్టీ చేసిన కృషి తిరుపతి ఓటర్లు గుర్తించారని ఆయన అన్నారు.
అందుకే కేవలం 56820 ఓట్లు బీజేపీ అభ్యర్థి కి పడ్డాయని కానీ అందులో జనసేన వోట్లు 50000 వుంటాయని, కేవలం 6వేలు ఓట్లు మాత్రమే బీజేపీ ఓట్లు ఉన్నాయని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. అటువంటి పార్టీతో జనసేన తెగదెంపులు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.
4166 ఓట్లు సాధించిన నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో నవతరం పార్టీ అన్నీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని తెలిపారు.
ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇప్పటికయినా బీజేపీ నేతలు నిర్ణయం తీసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక గాలి వీచిందని తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళలో బీజేపీ కి ఎదురు గాలి తగిలిందని అన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలు, నోట్ల రద్దు,పౌరసత్వం బిల్లు వంటి ప్రజా వ్యతిరేక బిల్లులను బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెచ్చి దేశంలో ప్రజల కు కష్టాలను కొనితెచ్చారని అన్నారు.