అమరావతి రాజధానిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2015 లో ఎక్కడైతే శంకుస్థాపన చేశారో నేడు ఉద్దండరాయునిపాలెం లో అక్కడే రైతులు, మహిళలు రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగించాలని హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ పాల్గొని మద్దతు పలికారు. అనంతరం రామ్ విలేకరులతో మాట్లాడుతూ ఐదు కోట్ల ప్రజలు అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటే మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు పేరుతో ప్రజలతో ఆటలాడుతున్నారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి ఎవరూ ఊహించని విధంగా ప్రజలు 151 శాసనసభ్యులు ఇచ్చినా , పరిపాలన ఎలా చేయాలో అర్థం కావడం లేదని రామ్ అన్నారు. మహిళలు , రైతులు , రైతు కూలీలు చేస్తున్న ఈ హోమం కారణంగా భగవంతుడు వీరి మొర ఆలకించారు అనడానికి ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రామ్ డిమాండ్ చేశారు.