బీసీ నేతలపై కాంగ్రెస్ పార్టీ బరితెగించి మాట్లాడుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో తాడో పేడో తేల్చుకోవటానికి బీసీ నేతలు సిద్దమవుతున్నామన్నారు. బీసీ నేతలను అవమానించే వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో కాంగ్రెస్ను ఎదుర్కొంటామన్నారు. బీసీలకు జరుగుతోన్న అవమానంపై కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు స్పందించాలని కోరారు. ఇందిరా, రాజీవ్గాంధీ, సోనియాగాంధీలను తిట్టినవారు కాంగ్రెస్ కు నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు బీసీల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ప్రతి బీసీ కులాన్ని కించపరిచేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీ నాయకత్వాన్ని బలహీనపరిచే కుట్ర కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు.
పెయిడ్ ఆర్టిస్టులతో కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా బీఆర్ఎస్లో ఉన్న బీసీ నేతలను కాంగ్రెస్ టార్గెట్ చేసిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు గుప్పించారు.