తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు నేటితో ముగిసింది. రాష్ట్రంలోని 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆఖరి రోజు అయిన నేడు అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. రేపు అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఒక్కో వార్డుకు సగటున 5 మంది వరకు నామినేషన్లు దాఖలు చేశారు.
9 కార్పొరేషన్లలోని 325 డివిజన్లలో 2 వేల మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. 120 మున్సిపాలిటీల్లోని 2727 వార్డులకు 10 వేల మందికి పైగా నామినేషన్లు వేశారు. 12, 13 తేదీలలో నామినేషన్ల స్కృటినీ ఉంటుంది. ఈ నెల 14 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ. ఈనెల 22న పోలింగ్ జరగనుండగా 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.