రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, తాజాగా నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు అలాగే సోమశిల నుండి శ్రీశైలం వరకు క్రూయిజ్ ను ఏర్పాటుచేసి పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మలేషియా పర్యటనలో భాగంగా ఈ రోజు మలేషియాలోని తెలంగాణ సంఘ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ టూరిజం బ్రోచర్లను మంత్రి విడుదల చేశారు. సింగపూర్ టి.ఆర్.ఎస్ వైస్ ప్రెసిడెంట్ మారుతి, కార్యదర్శి వెంకటేష్, తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతి, తెలుగు సంఘ చైర్మన్ కాంతారావు లతో మంత్రి సమావేశమయ్యారు. తెలుగు వారు మలేషియా లో ఇంతగా అభివృద్ధి చెంది ఉండటం రెండు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎంతో ముందు చూపుతో రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ప్రణాళికలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రిజర్వాయర్ లను, పార్కులను ఏర్పాటుచేసి పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.