విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలో “క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్” అనే అంశం పై ఆరు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం.దీపిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం దీపిక మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్ అన్నది చాలా కీలకమని అన్నారు. నేర స్థలంలో లభ్యమయ్యే కీలక ఆధారాలను సేకరించడం చాలా కీలకమన్నారు. లభించిన ఆధారాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, పరిశీలన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక ఫోరెన్సిక్ ఎక్విప్మెంట్ తో కేసుల దర్యాప్తులో మంచి ఫలితాలు సాధించవచ్చు నన్నారు. అవసరం అయితే ఫోరెన్సిక్ అధికారుల సహకారంను కూడా కేసుల దర్యాప్తులో తీసుకోవాలని శిక్షణకు వచ్చిన పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ఎం దీపిక సూచించారు.
ఫోరెన్సిక్ సైన్స్ లెబోరేటరీ జాయింట్ డైరెక్టర్ ఆర్. ఈశ్వరమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఆరు జిల్లాల అధికారులకు 3 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామని అన్నారు. నిందితులకు శిక్ష పడే విధంగా కేసుల దర్యాప్తు చేపట్టే అధికారులకు సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరిగా అవసరమని అన్నారు.
దిశా కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, సాక్ష్యాలను సేకరించి, నిందితులకు ఖచ్చితమైన ఆధారాలతో శిక్ష పడే విధంగా దిశా ఎక్స్పర్ట్స్ స్వామి, రీన సుజన్ శిక్షణకు వచ్చిన అధికారుల నైపుణ్యాన్ని పెంచే విధంగా శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం.దీపిక, , ఎఫ్ఎస్ఎల్ జేడీ ఈశ్వరమ్మ, పీటీసీ ప్రిన్సిపాల్ నక్క ఆనందబాబు, దిశా ఎఫ్ఎస్ఎల్ అధికారులు స్వామి, రీనా సుజన్, ఆర్ఎఫ్ఎస్ఎల్ ఏడీ డా. నాగరాజు, సైంటిస్ట్ గీతా మాధురి, క్విక్ సాప్ట్ వెండర్స్ , ఆరు జిల్లాల పోలీసు అధికారులు పాల్గొన్నారు.