సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాటిని ప్రతిబింబింప చేసేదే బతుకమ్మ పండుగ అని ఆయన పేర్కొన్నారు. అటువంటి సంబరాలలో పాల్గొనేందుకు 40 వేల పై చిలుకు మహిళలు సద్దుల చెరువుకు తరలి రావడం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుందని ఆయన చెప్పారు.
బతుకమ్మ పండుగ సంబరాలలో బాగంగా బుధవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ (సద్దుల చెరువు)మీద ఏర్పాటు చేసిన కార్టూన్ ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొమురం భీం మొదలుకొని చాకలి ఐలమ్మ ,కాళోజీ ల మీద స్థానిక కార్టూనిస్ట్ వేసిన కార్టూన్ లు కూడా పండుగ ప్రాముఖ్యత ను తెలియపరుస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.
ప్రస్తుతం మినీ ట్యాంక్ బండ్ గా రూపాంతరం చెందిన సద్దుల చెరువుకు ఉన్న ప్రాశస్త్యం కూడా బతుకమ్మ పండుగ తోటే వచ్చిందని ఆయన తెలిపారు. అటువంటి సద్దుల చెరువును తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే మినీ ట్యాంక్ బండ్ గా ఆధునికరించమని, అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయమేనని ఆయన తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నార్ముల్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జడ్ పి వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్,టి ఆర్ యస్ నాయకులు వై వి ఉప్పాల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.