సినిమాలు చూసి నిజ జీవితంలో చేస్తున్నారో లేదా.. నిజ జీవితంలో చూసి సినిమాల్లో చేస్తున్నారో అర్థం కావడం లేదు. వాస్తవంగా జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇది కచ్చితంగా నిజమనిపిస్తుంది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ఫ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ సినిమాలో ఎర్ర చందనం అక్రమ స్మగ్లింగ్ కోసం హీరో రకరకాల ఎత్తుగడలు వేస్తుంటాడు. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే ములుగు జిల్లా వాజేడు మండలంలో చోటు చేసుకుంది.
కృష్ణాపురం రేంజ్ పరిధిలో అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రం నుంచి వస్తున్న ఓ లారీని తనిఖీ కోసం ఆపారు. మొదట ఇసుకే ఉందనుకున్న అధికారులు కాస్త లోతుగా చూడగా అసలు విషయం వెల్లడైంది. ఇసుక ముసుగులో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.10 లక్షల విలువ గల కలపను పట్టుకున్నట్లు ఎఫ్ఆర్వో చంద్రమౌళి తెలిపారు.
అటవీశాఖ అధికారులను చూసిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని విడిచి పారిపోయాడు. పట్టుకున్న కలప, లారీని వెంకటాపురం రేంజ్డివిజన్ ఆఫీస్ కు తరలించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.