యావత్ భారత దేశం గర్వించతగ్గ స్థితప్రజ్ఞుడు నిగర్వి, తెలంగాణ ముద్దుబిడ్డ ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశ అభివృద్ధికి కృషిచేసిన మహానుభావుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. ఆయనను నేటి నాయకులు, యువత ఆదర్శం తీసుకోవాల్సిన గొప్ప మేధావి అని ఆయన అన్నారు.
తొలి తెలుగు ప్రధాని గా పనిచేసిన తెలంగాణ తేజం పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాపితంగా ఉత్సవంలా జరుగుతున్నాయి. అందులో భాగంగా నేడు హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఉన్న పీవీ ఘాట్ లో వారి చిత్ర పటానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం సంక్షోభ సమయంలో దేశానికి ప్రధాని గా ఎన్నికై తన చాణక్యతతో రాజనీతిని ప్రదర్శించి నీతివంతమైన పరిపాలన అందించి దేశాన్ని గట్టెకించిన గొప్ప నాయకుడని అన్నారు. గురుకుల పాఠశాలలను నెలకొల్పి నాణ్యమైన విద్యను అందించిన గొప్ప దార్శనీకుడని అన్నారు.
తెలంగాణ బిడ్డగా దేశానికి పీవీ చేసిన సేవలు గొప్పవని ఆర్థికంగా దేశానికి ఒక సుస్థిర స్థానం నెలకొల్పటంలో వారి చతురత ఘనమైనదని గుర్తు చేశారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన వారికి భారత రత్న ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉన్నదని భారత రత్నకే వన్నె తెచ్చే గొప్ప చరిత్ర పీవీదని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ తరాలకు వారి చరిత్రను అందించేందుకు సంవత్సరం కాలం పాటు శత జయంతి వేడుకలు నిర్వహించటం హర్షించతగ్గ పరిణామం అని తెలిపారు.