రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనలో అంగన్ వాడీ టీచర్లను ఎండలో నిలబెట్టి బానిసలుగా చూసిన సంఘటనపై మహిళా కమిషన్ సుమోటో గా కేసు నమోదు చేయాలని నారాయణ పేట్ బిజెపి డిమాండ్ చేసింది.
నారాయణపేట జిల్లా కేంద్రంలో శనివారం మంత్రి కేటీఆర్ పర్యటనలో మహిళలను రోడ్లపై నిలబెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడిన సంఘటన లో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, జిల్లా అధికారులపై మహిళా కమీషన్ కేసు నమోదు చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు నాగు రావు నామా జి, రతన్ పాండు రెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షుడు పి. శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
ఆది వారం నారాయణపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పర్యటనలో దారిపొడవునా అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో పాటు ఇతర మహిళలను నిలబెట్టి దండాలు పెట్టించడం దారుణమని అన్నారు.
బాధ్యులైన ఐసీడీఎస్ అధికారులపై అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళ ఉద్యోగులకు తగిన గౌరవం దక్కడం లేదన్నారు. రోడ్లపై నాలుగు గంటల పాటు ఆకలి దప్పికలకు గురిచేసి కనీసం వారికి సరైన సదుపాయాలు కల్పించలేదని, కిందిస్థాయి మహిళ ఉద్యోగుల ను అధికారులు బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు.
అంగన్వాడీ టీచర్లకు సంబంధం లేకున్నా కూడా వారితో కొందరు అధికారులు వారితో పనులను చేయిస్తున్నారని ఇలాంటి అధికారులపై త్వరలోనే పూర్తిస్థాయి ఆధారాలతో బిజెపి తరపున మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
విలేకరుల సమావేశంలో నాయకులు ప్రభాకర వర్ధన్, నందు నామా జి, వెంకట్ రాములు, రఘు రామయ్య గౌడ్ సత్య రఘు పాల్ రెడ్డి పాల్గొన్నారు.