కేంద్రంలో బిజెపి పార్టీకి, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి పూర్తిస్థాయి అధికారాన్ని కట్టబెడితే పరిపాలన చేతకాక ధర్నాలు చేయడం ఇరు పార్టీల స్వార్థపూరిత అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు.
ప్రజల రక్తం పీల్చి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వసూలు చేస్తూ అదే కాక కేంద్రం రాష్ట్రం పోటీపడి గ్యాస్ ,పెట్రోల్ ,డీజిల్ రాష్ట్రం విద్యుత్ చార్జీలను పోటీపడి సామాన్యులపై మోయలేని భారాన్ని పెంచాయని ఆయన అన్నారు.
దీని వల్ల ప్రతి వస్తువు పై ధరలు పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయకపోగా వారి నిర్ణయాలు గుదిబండగా తయారయ్యాయి. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉండగా వాటిని విస్మరించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయం చేస్తున్నారని బండి సుధాకర్ గౌడ్ ఆరోపించారు.
కొత్త సినిమాల స్పెషల్ టికెట్ రేట్లు పెంచే ప్రభుత్వాలు ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలను కొనడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆయన అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా సంయుక్తంగా రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.