టీటీడీ లో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న అటవీ కార్మికులు 1000 రోజులుగా తమకు న్యాయం చేయండి అని రిలే నిరాహార దీక్షలు,నిరసన దీక్షలు చేస్తున్నా టీటీడీ లాంటి అతిపెద్ద ధార్మిక సంస్థ స్పందించకపోవడం టిటిడి ప్రతిష్టకు భంగకరమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారి శేషాచలం కొండలలోని అపారమైనటువంటి వృక్ష సంపదను 30 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుతున్న అటవీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరారు.
టిటీడి ఫారెస్ట్ కార్మికులను విభజించి పాలించు అన్న చందంగా పర్మినెంట్, టైం స్కేల్,కార్పొరేషన్ గా విడగొట్టి 200 మంది కార్మికుల కడుపు కొట్టడం ధర్మమా? టీటీడీ ప్రతినిత్యం “ధర్మో రక్షతి రక్షితః” అంటారు మరి ఇంత అధర్మంగా అన్యాయంగా అక్రమంగా 1000 రోజులుగా దీక్ష చేస్తున్న అటవీ కార్మికుల పట్ల మానవత్వంతో చర్చలకు పిలిపించి సమస్యను పరిష్కరించక పోవడం న్యాయమా? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా తిరుపతికి వచ్చినప్పుడు అటవీ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తానన్న హామీనీ టీటీడీ ఉన్నతాధికారులు,ధర్మకర్తల మండలి స్థానిక అధికార పార్టీ నాయకులు విస్మరించడం శోచనీయం అన్నారు.
టిటిడి అటవీ కార్మికులు గురువారం చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఇప్పటికైనా టీటీడీ ఉన్నతాధికారులు ధర్మకర్తల మండలి వెంటనే అటవీ కార్మికులను చర్చలకు పిలిపించి న్యాయం చేయాలని నవీన్ డిమాండ్ చేశారు.