ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5న జరగనున్న సీతారాముల కల్యాణోత్సవం రోజున భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లను టీటీడీ జెఈఓ వీరబ్రహ్మం, వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ శుక్రవారం పరిశీలించారు.
ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి కల్యాణోత్సవం రోజున పట్టువస్త్రాల సమర్పణకు వచ్చినప్పుడు ఆలయంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో జెఈవో చర్చించారు. అనంతరం కల్యాణవేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. గ్యాలరీల్లో భక్తులకు కల్పించాల్సిన వసతులు ఇతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చర్చించారు. అనంతరం వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ జిల్లా డెప్యుటేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆలయం వద్దగల పరిపాలన భవనంలో జెఈవో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జెఈవో వెంట ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) వెంకటేశ్వర్లు, డిఇ చంద్రశేఖర్, ఇఇ సుమతి, డిఎఫ్ఓ శ్రీనివాస్, డెప్యూటీ ఈవోలు గుణభూషణ్ రెడ్డి, నటేష్ బాబు, శివప్రసాద్, సుబ్రహ్మణ్యం, అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్ కుమార్ ఇతర అధికారులు ఉన్నారు.