కడప జిల్లా సిద్దవటం మండలం కడప చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాధవరం-1 సమీపంలో సంభవించిన ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
సిద్దవటం మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సిద్దవటం నుండి ఒంటిమిట్ట వైపు వస్తుండగా, కడప నుండి చెన్నై వైపు వెళుతున్న లారీ డీ కొన్నది.
దాంతో స్కూటర్ పై ప్రయాణిస్తున్న ప్రతాప్, నవనీశ్వర్ మృతి చెందగా, వెంకటరమణ పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న మృతుల బంధువుల రోదన వర్ణనాతీతం. ప్రమాదం జరిగిన తీరు చూసిన గ్రామస్తుల మనసులు వికలమయ్యాయి. ప్రమాదం కూడా అత్యంత ఘోరంగా జరిగింది.
భౌతిక దేహాలు ఛిద్రమై గుర్తు పట్టలేంతగా ముక్కలు ముక్కలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుప్రక్కల ప్రజలు, వాహన దారులు అక్కడికి చేరడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
విషయం తెలుసుకున్న సిద్దవటం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను అదుపు చేస్తూ జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.