విజయనగరం జిల్లాలో కొమరాడ పోలీసులకు…అత్తింటికే కన్నం వేసినఇద్దరు దొంగ అల్లుళ్లను అరెస్ట్ చేసారు. ఈ మేరకు పార్వతీపురం డీఎస్పీ అందించిన వివరాల ప్రకారం… కొమరాడకు చెందిన అక్కమ్మ కు ముగ్గురు కుమార్తెలు కలరు. పెద్ద కుమార్తెకు వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చెయ్యగా, తరువాత ఇద్దరు కుమార్తెలను సీతానగరం మండలం పాపమ్మవలసకు చెందిన ఆవాల సింహాచలం, ఆవాల గణేష్ లు అనే అన్నదమ్ములకు ఇచ్చి వివాహం చేసారు.
వీరిలో చిన్న అల్లుడు అవాల గణేష్ అత్తవారింటికి ఇల్లరికం వచ్చి, ఇంటి వ్యవహారాలు చూసుకుంటున్నారు. మామ గొర్రెల వ్యాపారం నిమిత్తం వారమేసి రోజులు బయటకు వెళ్లడం, తిరిగి ఇంటికి రాకపోవడం, అత్త అక్కమ్మ అరటి పండ్ల వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్ళడం గమనించిన గణేష్ లో దుర్బుద్ధి పుట్టింది.
ఎలాగైనా అత్తవారింటికి కన్నం వేయాలని భావించి, పథకం రచించి, తన అన్న సింహాచలంను కొమరాడకు రప్పించాడు. విషయం చెప్పి అత్తవారింటిలో ఈనెల 2 వతేదీన రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి కన్నం వేసి…దాదాపు 8 తులాల బంగారం… 20 వేలు నగదు అపహరించుకుని పారిపోయారు.
దీంతో అక్కమ్మ రెండోఅల్లుడు ఆవాల గణేష్ భార్య నీలవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొమరాడ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నేర స్థలం వద్ద సేకరించిన ఆధారాలను బట్టి, చిన్న అల్లుడు గణేష్ ను పోలీసులు విచారణ చేసి, వాస్తవాలను రాబట్టారు.
నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అతని అన్న సింహాచలంను కూడా కొమరాడ పోలీసులు అరెస్టు చేసి, వారి నుండి 8 తులాల ఆభరణాలు, 20 వేలు నగదు రికవరీ చేసినట్లు, నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పార్వతీపురం సీఐ విజయానంద్, కొమరాడ ఎస్ఐ ప్రయోగ మూర్తి పాల్గొన్నారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్