బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం ఈ నెల 21న భారత్ రానున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 22న మోడీని కలవడానికి న్యూఢిల్లీకి జాన్సన్ వెళతారు. అక్కడ భారతదేశం-యుకె వ్యూహాత్మక రక్షణ, దౌత్య మరియు ఆర్థిక భాగస్వామ్యంపై చర్చిస్తారు.
ఈ చర్చలలో UK, భారత్ రెండింటిలోనూ కీలక పరిశ్రమలలో పెట్టుబడి ఒప్పందాలు జరుగుతాయని బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలలో పురోగతిని సాధించడానికి జాన్సన్ భారత్ పర్యటన ఉపయోగపడుతుంది. “ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధి నుండి ఇంధన భద్రత, రక్షణ వరకు రెండు దేశాల ప్రజలకు అవసరమైన ఒప్పందాలను నా భారతదేశ పర్యటన ద్వారా సాకారం చేసుకునే వీలుకలుగుతుంది” అని జాన్సన్ ఒక ప్రకటనలో తెలిపారు.
నిరంకుశ రాజ్యాల నుండి బెదిరింపులను ఎదుర్కొంటున్నందున శాంతి, శ్రేయస్సు, ప్రజాస్వామ్య వ్యవస్థలు కొనసాగించేందుకు స్నేహితులు కలిసి ఉండటం చాలా అవసరం. భారతదేశం, ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, ఈ అనిశ్చిత సమయాల్లో UKకి అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామిగా ఉందని కూడా ఆయన అన్నారు.
“గుజరాత్లో కీలకమైన రెండు ప్రధాన పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా అత్యాధునిక శాస్త్రం, ఆరోగ్యం, సాంకేతికతపై కొత్త సహకారాన్ని బ్రిటన్ ప్రభుత్వం అందచేస్తుంది. ఈ కారణంగా భారత్ లో ఎన్నో ఉద్యోగాల కల్పన జరుగుతుంది. తద్వారా వృద్ధిని పెంచడంతోపాటు ఇరు పక్షాలకు లాభం చేకూరుతుంది’’ అని ఆయన అన్నారు. భారతదేశంలోని ఐదవ అతిపెద్ద రాష్ట్రమైన గుజరాత్ బ్రిటీష్-ఇండియన్ డయాస్పోరా జనాభాలో దాదాపు సగం మందికి పూర్వీకుల నివాసం. అందుకే UK అక్కడ భారీ పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నది.