లఖీంపూర్ ఖేరి కేసులో తన కుమారుడు అడ్డంగా బుక్కయినా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తీరు మారడంలేదు. తాజాగా ఆయన మీడియాపై చిందులు వేశారు. ఈ కేసులో కేంద్రమంత్రి కుమారుడు ఆశిశ్ మిశ్రా ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. దీనిపై ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులను కేంద్రమంత్రి అజయ్ మిశ్రా బండబూతులు తిట్టారు. పిచ్చి పిచ్చిగా ఉందా ? అంటూ ఓ జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు. అంతేకాదు ఇక్కడి నుంచి కెమెరాలు బంద్ చేసుకొని వెళ్లిపోవాలని ఇతర మీడియా సిబ్బందిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటన తాజాగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లఖింపూర్ ఖేరీ ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్రే అని ఆ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ తేల్చి చెప్పడంతో రాజకీయంగా పెను దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ఈ విషయంపై లోక్సభలో వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు.