నేరాల అదుపునకు సంబంధించి దిశ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. స్థానిక సన్ రైజ్ కన్వెన్షన్ లో శ్రీకాకుళం జిల్లా పోలీసు యంత్రాంగం నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దిశా చట్టం రూపొందించామని అన్నారు.
దీని ద్వారా నిందితులను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశం, సంకల్పంతో తదనుగుణంగా నేరస్తులను త్వరగా పట్టుకునే క్రమంలో భాగంగా యాప్ కూడా రూపొందించామని అన్నారు. దీని సాయంతో మహిళలు ఏ సమస్యలో ఉన్న రక్షణకు సంబంధించి వెంటనే సంబంధిత వర్గాలను అప్రమత్తం చేసి, సాయం పొందవచ్చన్నారు.
దేశంలో చాలా నేరాలు జరుగుతున్నాయి అని, నేరస్తులు కొన్ని సార్లు తప్పించుకునే సందర్భాలు ఉన్నాయి అని, నేరస్తులకు తగిన సమయంలో తగిన రీతిలో శిక్షలు పడడం లేదన్న భావన ప్రజల్లో పూర్తిగా తొలగిపోయేందుకు వీలుగా దిశ చట్టం రూపొందించామని పునరుద్ఘాటించారు.
చదువుకున్న యువతీయువకులు దిశ చట్టంపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు దిశ యాప్ ను సద్వినియోగం చేసుకునే విధంగా, ఆపదలో మీ చుట్టూ పక్కల ఉన్న వారికి సాయం చేసే విధంగా తోటి వారిని ఎడ్యుకేట్ చేయాలని కోరారు.
దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో సీఎం జగన్ ఈ దిశ యాప్ ను తీసుకు వచ్చారు అని, అదేవిధంగా చట్ట పరిధిలో దీని అమలుకు సంబంధించి కృషి చేస్తున్నారని వివరించారు. బాధిత వర్గాలకు నిరంతరం అండగా ఉండే విధంగా నిఘా వర్గాలు మహిళల కోసం పనిచేస్తున్నాయని కితాబిచ్చారు.
సమాజంలో నేరాలు సంఖ్య తగ్గాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. తమ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉంది అని, ఇందులో ఎటువంటి అనుమానాలకూ తావే లేదని స్పష్టం చేశారు.అనంతరం జిల్లా ఎస్పీ రాధిక నేతృత్వంలో యాప్ వినియోగం, ఉపయోగాలను సిబ్బంది వివరించారు.
యాప్ డౌన్లోడ్ ప్రాసెస్ ను వివరించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మంత్రి సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జాయింట్ కలెక్టర్ విజయ సునీత, జెడ్పి చైర్మన్ విజయ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక అతిథులు సింగర్ రేవంత్, ప్రజ్ఞా జైస్వాల్ విచ్చేశారు.