రేబిస్ వ్యాధిరహిత ప్రాంతాలుగా చేయుట మునిసిపాలిటీ, గ్రామ పంచాయతీల బాధ్యత అని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్, జంతు జనన నియంత్రణ కేంద్రాలు, కుక్కల స్టేరిలైజేషన్ లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీధి కుక్కల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీధి కుక్కలు దాడికి యత్నించినప్పుడు భయపడి పరుగెత్తకూడదని, ఎదురుగా నిలబడాలని, చిన్న పిల్లలను ఒంటరిగా కుక్కల గుంపు వద్దకు వెళ్లకుండా నిరోధించాలని అన్నారు. పిల్లలు ఉన్న కుక్కతల్లులకు దూరంగా సంచరించాలన్నారు. వీధి కుక్కలకు ఆహారం జనసందోహం లేనిచోట, నిర్ణీత సమయంలో అందించాలన్నారు. మధ్య కాకుండా, దూరంగా ఇవ్వాలని ఆయన తెలిపారు. కుక్క కరిస్తే వెంటనే సబ్బుతో గట్టిగా ఒత్తి కడిగి సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి రేబిస్ వ్యాధి నిరోధక టీకా వేయించుకోవాలని విద్యార్థులకు, ప్రజలకు తెలపాలని అన్నారు. కుక్కల బారిన పడకుండా రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయకూడని పనులపై స్వయం సహాయక సంఘాల సమావేశాల్లో అవగాహన కల్పించాలన్నారు.
పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్లు, ఫంక్షన్ హాళ్లు, రెస్టారెంట్ల వద్ద కుక్కల పట్ల జాగ్రత్త, చేసే, చేయకూడని పనులకు సంబంధించి రూపొందించిన పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. జంతు జనన నియంత్రణ ఖమ్మం పట్టణంలోని ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ లో చేపట్టుట జరుగుచున్నది, ఇప్పటికి 3,658 కుక్కలకు ఆపరేషన్లు చేసినట్లు తెలిపారు. మిగతా మునిసిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో భవనాలు గుర్తించి, నెలాఖరులోగా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, వచ్చే నెల నుండి ఆపరేషన్లు నిర్వహించేలా చూడాలని, 6 నెలల్లో జిల్లాలోని వంద శాతం కుక్కలకు ఆపరేషన్లు చేపట్టేలా లక్ష్యం పెట్టుకోవాలని ఆయన తెలిపారు. వీధి కుక్కలా బెడదను దృష్టిలో ఉంచుకొని చికెన్, మటన్ షాపులు, ఫంక్షన్ హాళ్ల నుండి వచ్చే వ్యర్థాలను బయట వేయకుండా ఏజెన్సీ నిర్వహకులు తీసుకుపోయేలా పర్యవేక్షించాలన్నారు. పార్కులు తదితర ప్రదేశాల్లో కుక్కల కొరకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రులు, ప్రాంతాల వారిగా కుక్క కాటు కేసుల నమోదు వివరాలు సమర్పించాలని, ఎక్కువ కేసులు వచ్చిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు.