బలహీన వర్గాలకు చెందిన వారు వ్యాపారాలు చెయ్యడం పారిశ్రామికంగా ఎదగడం కొన్ని పార్టీలకు, వ్యక్తులకు కంటగింపుగా ఉందని అఖిల భారతీయ వంజరి సేవ సంఘం ఆరోపించింది. బీసీ లు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని, అడ్డుకట్టలు వేస్తున్నారని సంఘం సీనియర్ ఉపాధ్యక్షులు సాల్వేరు కృష్ణ వంజరి, తెలంగాణ వంజరి సేవ సంఘం అధ్యక్షుడు ఎదుగాని శంకర్ నారాయణ, ప్రధాన కార్యదర్శి ధాత్రిక ధర్మరాజు లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి పై, సంస్థలపై ఇటీవల ఎన్ ఫోర్సుమెంట్ దాడులు జరిపిన విషయం తెలిసిందే. గంగుల కమలాకర్ ఎదుగుదల చూసి ఓర్వలేని వారే ఫిర్యాదులు చేస్తున్నారని, ఈడి దాడులు చేస్తున్నదని వారన్నారు. అసలు ఈ దేశంలో ఈడి దాడులు చేయాల్సింది అంబానీ అదాని కంపెనీ ల పైన కానీ బడుగు బలహీన వర్గాల పారిశ్రామిక వేత్తలపైనా కాదని వారు పేర్కొన్నారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కు అఖిల భారతీయ వంజరి సేవ సంఘం పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తున్నదని, ఆయనపై జరిగే దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు.