శ్రీ శార్వరీ నామ సంవత్సర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 31న ఇంద్రకీలాద్రి లోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి తెలిపారు. ప్రధానాలయంలో శ్రీ అమ్మవారిని వరలక్ష్మి దేవి గా అలంకరించి, వరలక్ష్మి వ్రతం నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించిందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్నందున ప్రతీ ఏడాది నిర్వహించే విధంగా సామూహిక వరలక్ష్మీ వ్రతములు (ఆర్జిత సేవ), ఉచిత సామూహిక ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయంలో అమ్మవారికి దేవస్థానవారే వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
వ్రతంలో పరోక్షముగా గోత్రనామాలు చెప్పించుకోవడానికి అవకాశం కల్పించామని వెల్లడించారు. టిక్కెట్టు కావలసిన భక్తులు దేవస్థాన వెబ్ సైటు www.kanakadurgamma.org ద్వారా సొమ్ము చెల్లించి టిక్కెట్టు పొందాలి. పరోక్ష వరలక్ష్మీ వ్రతం జరిపించుకున్న భక్తులకు ఖడ్గమాల చీర, రవిక, కుంకుమ ప్రసాదము పోస్టు ద్వారా పంపుతామని చెప్పారు.
సేవా రుసుం రూ.1500 లు గా నిర్ధారించారు. అదే విధంగా ఆగస్టు 2 నుంచి 4వ తేదీ వరకూ నిర్వహించే పవిత్రోత్సవం కారణంగా దేవస్థానంలో జరిగే ఆర్జిత సేవలు (ప్రత్యక్షం, పరోక్షం నిలుపుదల చేసినట్లు కార్యనిర్వహణాధికారి తెలిపారు.