పెద్దల సభ అయిన రాజ్యసభలో సభ్యులు అత్యంత దారుణంగా ప్రవర్తించిన సంఘటనను ఉపేక్షించరాదని ఏడుగురు కేంద్ర మంత్రులు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడిని కోరారు. ఆగస్టు 11న సభలో కొందరు ప్రతిపక్ష సభ్యులు హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడ్డ విషయం తెలిసిందే.
ఈ సంఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్రంగా కలత చెందారు. ఉప రాష్ట్రపతిని కలిసిన బృందంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్, అర్జున్రాం మేఘ్వాల్, మురళీధరన్ ఉన్నారు.
విషయాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటానని కేంద్రమంత్రుల బృందానికి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ కూడా పాల్గొన్నారు. సంఘటన జరిగిన సమయంలో సభకు నేతృత్వం వహించిన ప్యానల్ వైస్ ఛైర్మన్ సంబిత్ పాత్రో తోనూ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సమావేశమై నాటి ఘటనల గురించి ఆరా తీశారు. శనివారం పార్లమెంటుకు వెళ్లి నాటి వీడియో రికార్డింగు కూడా పరిశీలించారు.
భవిష్యత్తులో మరెవరూ కట్టు తప్పకుండా బాధ్యులైన ఎంపీలపై గట్టి చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను వెంకయ్యనాయుడు అన్వేషిస్తున్నారు.