రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఆర్ అండ్ బి,నేషనల్ హైవే అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఆర్ అండ్ బి,నేషనల్ హైవే అధికారులు అందరూ తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలి.
వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి కాబట్టి ఆర్ అండ్ బి శాఖ పరిధిలో ఉన్న స్టేట్ రోడ్లు, నేషనల్ హైవేలపై ప్రజారవాణాకు ఇబ్బంది ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నేషనల్ హైవే సిబ్బంది తక్కువ ఉంటారు కాబట్టి ఆర్ అండ్ బి సిబ్బంది వారిని సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. వరంగల్, ఖమ్మం జిల్లాలో వర్షపాతం ఎక్కువున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలి.మనం పనిచేసేదే ప్రజల కోసం కాబట్టి వారికి ఎట్టి పరిస్థితుల్లోను ఇబ్బందులు తలెత్తకుండా ఆర్ అండ్ బి,నేషనల్ హైవే సిబ్బంది కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి అన్నారు.
విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై సీఎస్ సోమేశ్ కుమార్,ఏవియేషన్ చీఫ్ భరత్ రెడ్డి తో మంత్రి వేముల ఫోన్లో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ఏవియేషన్ సిద్ధంగా ఉండాలని అన్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెలికాప్టర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.అన్ని జిల్లాల్లో హెలిప్యాడ్లు,దానికి సంబంధించిన ఫ్యుయల్ సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టేలా చూడాలని సీఎస్ సోమేశ్ కుమార్ కు సూచించారు.
సహాయక చర్యల్లో పాల్గొనే ప్రతి హెలికాప్టర్ కు ఫస్ట్ ఎయిడ్ కిట్,మెడికల్ టీమ్ ఉండేటట్లు చూడాలని సీఎస్ కు చెప్పారు.