గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలో తల్లిదండ్రులను వర్షంలో బయటకు నెట్టాడు ఒక కసాయి కొడుకు. కన్నవారికి తోడపుట్టిన వారికి తెలియకుండా చిన్న కుమారుడు రామకృష్ణ తల్లదిండ్రులతో ఆస్తులను రాయించుకున్నాడు.
విషయం తెలుసుకున్న పెద్ద కొడుకు వచ్చి రామకృష్ణని నిలదీశాడు. ఆస్తులు తెలియకుండా ఎందుకు తీసుకున్నావ్ అని గొడవ పడటంతో పెద్దల జోక్యంతో ఇరు కుటుంబాలు పోలీసులు ఆశ్రయించారు. పెద్ద మనుషులు సమక్షంలో ఎవరి ఆస్తులు వాళ్ళు జాగ్రత్తగా పంచుకోవాలని పోలీసులు హెచ్చరించి పంపించారు.
అనంతరం నాపై కేసు పెడతారా అని చిన్న కొడుకు తల్లిదండ్రులను ఉంటున్న ఇంటి నుండి బయటకు వెళ్లగొట్టి అమానుషంగా ప్రవర్తించాడు. నవ మాసాలు మోసిన తల్లిపై చేయిచేసుకున్నాడు.
వృద్ధులను హింసించి ఇంటి నుంచి బయటకు గెంటేయటంతో గత మూడు రోజుల నుండి ఇంటి ముందు వర్షంలో తడుస్తూ కూర్చున్న ముసలి వాళ్ళని అక్కడ నుంచి కూడా గెంటేశాడు. కొడుకు మెడపట్టి రోడ్డుపైకి నెట్టడంతో గత్యంతరం లేక ఊరి చివర వున్న ఒక మండపంలో ఆ వృద్ధులు తలదాచుకుంటున్నారు.
ఎండకి ఎండి వానకి తడుచుకుంటూ 80 సంవత్సరాల వృద్ధులు కొడుకు నిర్వాకానికి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కనికరం లేని కొడుకు నుండి న్యాయం దొరక్కపోతే చావే శరణ్యమని పండు ముసలి దంపతులు రోదిస్తున్నారు.