కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో విజయ డైరీ పాలకేంద్రం వద్ద పాడి రైతులకు టోకరా ఇస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన పాలను పాలకేంద్రంలోని సిబ్బంది పలు రకాల కారణాలు చూపించి ధర తగ్గిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పాడి రైతులను మభ్యపెట్టి ఫ్యాట్ లేదంటూ తక్కువ ధరను కేటాయిస్తున్నారని అంటున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు సేకరించిన పాలను అరవై రూపాయల చొప్పున అమ్ముకుంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్యాట్ లేదంటూ లీటరుకు ముప్పై నలభై రూపాయలు తమకు చెల్లిస్తున్నారని పలువురు రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ప్రతి రోజు ఆయా గ్రామాల ద్వారా వందలాది లీటర్ల పాలను మండల కేంద్రానికి తీసుకువచ్చి అరవై రూపాయల చొప్పున ఇతరులకు పాలను అమ్మే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
అంతే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి మిగిలిన పాలను మహారాష్ట్రలోని దెగ్లూర్ మండల కేంద్రంలో ప్రత్యేక దుకాణంను ఏర్పాటు చేసుకుని అక్రమంగా ఈ పాలను అమ్ముతున్నారని మండల రైతులు తెలుపుతున్నారు. ఈ విషయం డైరీ జిల్లా అధికారిణికి చరవాణిలో వివరణ కోరగా ఈ విషయంపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
‘‘ఇరవై ఏళ్లుగా విజయ డైరీకి పాలు పోస్తున్నాను కానీ మాకు ఇప్పటి వరకు రాయితీపై పాడిగేదెలు ఇవ్వలేదు. గేదెలు ఇస్తామంటే బ్యాంకు ద్వారా పది లక్షల వరకు రుణాలు తీసుకుని షెడ్డు కూడా ఏర్పాటు చేసుకున్నాం కానీ మాకు పాడి గేదెలు ఇవ్వలేదు. దీనిపై తమకు అధికారులు న్యాయం చేయాలి’’ బిచ్కుంద పాడి రైతు కపిల్ దేవ్ అన్నారు.