విజయనగరంలోని స్థానిక అంబటి సత్రం జంక్షన్లో ఉన్న ప్రెస్క్లబ్ నిర్వహణ, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు భేటీ అయ్యారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి. రమేష్ ఆధ్వర్యంలో నగరంలో ని అంబటి సత్రం వద్ద ప్రెస్క్లబ్లోని సీవై చింతామణి కాన్ఫరెన్స్ హాలులో సమావేశం జరిగింది. జిల్లాకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, కెమెరా మెన్లు, ఫొటో గ్రాఫర్లు హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల గత కొంతకాలంగా ప్రెస్క్లబ్ అందరికీ అందుబాటులో లేకపోవటం… నిర్వహణకు నోచుకోకపోవటం అందరికీ తెలిసిందే. దీనిపై జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశాలను అనుసరించి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి రమేష్ జిల్లాలోని వివిధ వర్గాల జర్నలిస్టులతో ప్రెస్క్లబ్ భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ప్రెస్క్లబ్ మెరుగైన నిర్వహణకు సంబంధించి పలువురు జర్నలిస్టులు ఈ సందర్భంగా సలహాలు, సూచనలు అందజేశారు. భవిష్యత్తు కార్యాచరణపై వారి అభిప్రాయాలను వెల్లడించారు. వీలైనంత త్వరగా ప్రెస్క్లబ్ను అందరికీ అందుబాటులోకి తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. దీని నిర్వహణకు సంబంధించి సీనియర్, జూనియర్ జర్నలిస్టుల సమన్వయంలో నిబంధనలను అనుసరించి ఒక అడ్ హక్ కమిటీని నియమించాలని అధిక సంఖ్యలో మీడియా మిత్రులు అభిప్రాయపడ్డారు. విభేదాలు లేకుండా సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. జర్నలిస్టుల అందరి సహకారంతో సమస్యను సున్నితంగా పరిష్కరించి వీలైనంత త్వరగా ప్రెస్క్లబ్ను అందుబాటులోకి తీసుకొస్తామని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి. రమేష్ తెలిపారు. నిబంధనలను అనుసరించి ఒక అడ్ హక్ కమిటీని త్వరలోనే నియమిస్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి. రమేష్, ఏపీఆర్వో డి. నారాయణరావు, పీఆర్వో ఎం. వాసుదేవరావు, ఏవీఎస్ సత్యనారాయణ, జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టులు సురేష్, ఆదినారాయణ, బూరాడ శ్రీనివాసరావు,రాధాకృష్ణ, పంతులు,పీ. అప్పారావు, పీ.ఎస్ఎస్.శివ ప్రసాద్ ,చక్రవర్తి అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, కెమెరా మెన్లు, ఫొటో గ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.