ఇటీవలే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ నుంచీ ఐజీగాపదోన్నతి పొందిన విశాఖ రేంజ్ ఐజీ రంగారావు విజయనగరం జిల్లాలో నాలుగు పీఎస్ లను ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు నగరంలోని దిశా మహిళా పోలీసు స్టేషన్, డిఎస్పీ కార్యాలయం, విజయనగరం రూరల్ సర్కిల్ కార్యాలయం, భోగాపురం పోలీసు స్టేషనులను తనిఖీ చేసారు.
విశాఖ నుంచీ నేరుగా మధ్యాహ్నం….సుమారు రెండున్నర గంటలకు కంటోన్మెంట్ ప్రాంతం పోలీస్ బ్యారెక్స్ లో ఉన్న దిశా పోలీసు స్టేషన్ కు వచ్చారు. అక్కడే జిల్లా ఎస్పీ ఎం.దీపిక,దిశా డిఎస్పీ టి.త్రినాధ్ లు..రేంజ్ ఐజీకీ స్వాగతం పలికారు. దిశ పీఎస్ లో రేంజ్ ఐజి కి దిశా పోలీసు స్టేషన్ సిబ్బంది ఫాలెన్ రూపంలో గాడ్ ఆఫ్ ఆన్ తో శాఖా పరంగా గౌరవందనం ఇచ్చారు.
వెంటనే అక్కడే సిబ్బందిని వారి పని తీరును అడిగి తెలుసుకున్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత కల్పించాలన్నారు. అనంతరం, దిశా పోలీసు స్టేషన్ లోకి వెళ్లి డీఎస్పీ ఛాంబర్ లో కూర్చొని దిశ పీఎస్ కు వస్తున్న కేసుల వివరాలను డీఎస్పీ త్రినాద్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అక్కడే రిసెప్షన్ సిబ్బంది చే రికార్డులు అడిగి తెప్పించుకుని… కేసు డైరీలను పరిశీలించారు.
మహిళల ఫిర్యాదులపై నమోదవుతున్న కేసుల్లో దర్యాప్తును త్వరితగతిన పూర్తిచేసి, నిర్దిష్ట సమయంలోనే కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, విజయనగరం డిఎస్పీ కార్యాలయాన్ని ఐజి సందర్శించారు.
ఈ సందర్బంగా కార్యాలయం మొత్తం ప్రాంగణాన్ని, అక్కడే ప్రత్యేకించి ఏఎస్పీ అనిల్ ఏర్పాటు చేయించిన ఫస్ట్ సైబరు సెల్ ను పరిశీలించారు. అలాగే సబ్ డివిజను కార్యాలయ రికార్డులను, గ్రేవ్ కేసుల దర్యాప్తును పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసారు.
అక్కడ నుంచీ సరిగ్గా 4 గంటలకు విజయనగరం రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని ఐజీ విజిట్ చేసారు. సీఐ మంగవేణి ఆదేశాలతో రూరల్ ఎస్ఐలు నారాయణ, గుర్ల ఎస్ఐలు హుటాహుటిన రూరల్ సీఐ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు గంటన్నర పైగా ఐజీ రంగారావు రూరల్ సీఐ కార్యాలయంలో ఉన్నారు.
ఇటీవల పట్టుబడ్డ గంజాయి కేసులలో సిబ్బంది అనుసరిస్తున్నచేపడుతున్న,తీసుకుంటున్న చర్యలను సీఐతో పాటు ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు…ఐజీ రంగారావు. అక్కడ నుంచీ బ్యారెక్స్ లో ఉన్న పోలీస్ గెస్ట్ హౌస్ లో కాస్సేపు విశ్రాంతి తీసుకుని… భోగాపురం పోలీసు స్టేషను రేంజ్ ఐజి సందర్శించి, రికార్డులను, సిడి ఫైల్స్ ను పరిశీలించారు.
విశాఖపట్నం రేంజ్ ఐజి ఎల్.కే.వి. రంగారావు మాట్లాడుతూ – ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో నమోదవుతున్న నేరాలకు అనుగుణంగా పోలీసు అధికారులు నూతన విధానాలను అవలంభించాలన్నారు. పోలీసు స్టేషను పరిధిలో జరుగుతున్న నేరాలకు అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయడం, వారికి నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
అదే విధంగా గ్రామస్థాయిలో మహిళా పోలీసుల సేవలను వినియోగించుకోవాలన్నారు. నమోదవుతున్న నేరాలకు అనుగుణం గా ప్రణాళికలు రూపొందించుకొని, నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను విశాఖపట్నం రేంజ్ ఇన్స్పెక్టరు జనరల్ ఎల్.కే.వి.రంగారావు ఆదేశించారు
ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ ఎం. దీపిక, విజయనగరం సబ్ డివిజన్ ఇన్ చార్జ్ అదనపు ఎస్పీ అనిల్, దిశా డిఎస్పీ టి. త్రినాధ్, సీఐలు మళ్ళా శేషు, టి. ఎస్. మంగవేణి, ఎన్. శ్రీనివాసరావు, రుద్రశేఖర్, విజయనాధ్ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.