అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో 27 పాయింట్లపై దృష్టి…..!
మొన్నటి వరకు “దిశ” కు ప్రత్యేక పోలీస్ అధికారిగా ఉన్న దీపికా ఎం పాటిల్…విజయనగరం జిల్లా ఎస్పీగా చార్జ్ జూన్ నెలలో చార్జ్ తీసుకున్న తర్వాత తొలిసారిగా మీడియా సమావేశం పెట్టి…ప్రత్యేకించి నేరాల నియంత్రణకు అందునా కార్పొరేషన్ గా మారిన విజయనగరంలో శాఖాపరంగా ఏయే చర్యలు తీసుకుంటున్నామో…పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియ చేసారు. నేరాలను నియంత్రించేంకు సాంకేతిక సౌలభ్యంతో ప్రత్యేకంగా రూపొందించిన రెండు హాక్ వాహనాలను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఈ సందర్బంగా ప్రారంభించారు.
అంతకుముందు డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ దీపిక మీడియాతో మాట్లాడుతూ నేరాలను నియంత్రించేందుకు విజయనగరం మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి, కొన్ని ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ రద్దీ ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగును పెంచడంతో పాటు, బ్లూకోల్ట్, హాక్ వాహనాలతో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.
విజిబుల్ పోలీసింగ్ తో ట్రాఫిక్ నేరాల అదుపు
మహిళల రక్షణకు చర్యలు చేపట్టడంతో పాటు మహిళల భద్రతకు ఇకపై రాత్రి బీట్లును ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే విధంగా నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నేర పరిజ్ఞానం కలిగిన పోలీసులను నియమించి, నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామన్నారు. మహిళల భద్రత, న్యూ సెన్సు చేసే వారి పైన, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పైనా, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపైనా విజిబుల్ పోలీసింగులో ప్రత్యేక దృష్టి పెట్టి, చర్యలు చేపడతా మన్నారు.
ఇందులో భాగంగా వన్ టౌన్ పరిధిలో గంట స్థంభం, సిఎంఆర్ జంక్షన్, రైల్వే స్టేషను, కామాక్షి నగర్, ఆర్ అండ్ బి,కోట జంక్షన్, గణేష్ కోవెల, కేపి టెంపుల్, ఐనాక్స్, కలెక్టరేట్ జంక్షన్, టూటౌన్ పరిధిలో పూల్ బాగ్, కొత్తపేట నీళ్ళ ట్యాంకు, అంబటి సత్రం, కోట్ల మాదప్ప జంక్షన్, అయ్యకోనేరు, ఎస్ ఎన్ నగర్ ఆర్చ్, ఫోర్టు స్కూలు, దాసన్నపేట జంక్షన్, బాబామెట్ట 7 కోవెళ్ళు కోట జంక్షన్, విజయగరం రూరల్ సర్కిల్ పరిధిలో జమ్ము జంక్షన్, అరుణ జ్యూట్ మిల్లు జంక్షన్, చెల్లూరు జంక్షన్, సుంకరిపేట జంక్షన్, పద్మావతినగర్ 6 మరియు 7 లైన్లు, మిమ్స్ ఆసుపత్రి, నెల్లిమర్లతో సహా 27 ప్రాంతాలను గుర్తించామన్నారు.
ఈ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసేందుకు అదనపు పోలీసు సిబ్బంది కోసం ఆర్మ్డ్ రిజర్వు పోలీసులను వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ రద్దీ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయడంలో హాక్ వాహనాలు చాలా ప్రత్యేకమైనవని, ఈ వాహనాల్లో రెండు హై రిజల్యూషన్ కెమెరాలను వాహనం ముందు, వెనుక ఏర్పాటు చేసి, లైవ్ వీడియోలను ఎప్పటికప్పుడు పరిశీలించే సౌలభ్యంతో పాటు, వారం రోజుల పాటు ఆడియో, వీడియోలను సేవ్ చేయవచ్చునన్నారు.
ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ వాహనంలో పబ్లిక్ అడ్రసింగు సిస్టమ్, జిపి ఆర్ ఎస్ సిస్టమ్, కమ్యూనికేషన్ జరిపేందుకు హై ఫ్రీక్వెన్సీ సెట్ లను కూడా ఏర్పాటు చేసామన్నారు. దిశా బీట్లుతో మహిళలను పని చేసే స్థలాలు, వారు నివాసం ఉండే వర్కింగు హాస్టల్స్, స్కూల్స్, కాలేజ్ లు, ఆర్టీసి కాంప్లెక్స్, రైల్వే స్టేషను వద్ద నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గొలుసు దొంగతనాల నియంత్రణకు ఇండ్లు విడిచి బయటకు వెళ్ళే వారు ముందుగా సంబంధిత పోలీసు స్టేషనుకు తెలియపర్చినట్లయితే ఆయా ఇండ్ల పై ఎల్ హెచ్ఎంఎస్ కెమెరాలను ఏర్పాటు చేసి, ఆయా ఇండ్లపై నిఘా పెడతామని జిల్లాఎస్పీ ఎం. దీపిక తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారయణ రావు, విజయనగరం డిఎస్పీ అనిల్ పులిపాటి, ఎస్బీ సిఐలు జి. రాంబాబు, ఎన్.శ్రీనివాసరావు, డిసిఆర్ బి సిఐ బి.వెంకటరావు, సీఐలుమురళి, లక్ష్మణరావు,మంగవేణి, ఎం.టి ఆర్ఐ పి.నాగేశ్వరరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.