పెద్దవాళ్లకు పెన్షన్ ఇస్తున్నాడు కదా అని ఇంటికి రానిస్తే ఒక వాలంటీర్ బాలికపై అత్యాచారం జరిపిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్న బూసి సతీష్(23) అనే యువకుడు బొబ్బిల్లంక గ్రామానికి చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు.
ప్రభుత్వ పధకాలు చేరవేత పేరుతో తరచూ బాలిక ఇంటికి వెళ్లివచ్చే సతీష్..ఇటీవల ఇంటిలో బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో..ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ సతీష్ బాలికను హెచ్చరించాడు.
అయితే అప్పటి నుంచి బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు..అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. గ్రామ వాలంటీర్ సతీష్ అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు సీతానగరం పోలీసులకు సమాచారం ఇవ్వగా..రంగంలోకి దిగిన పోలీసులు గ్రామ వాలంటీర్ సతీష్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
వైద్య పరీక్షల నిమిత్తం బాలికను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. నిందితుడు సతీష్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ శుభశేఖర్ తెలిపారు.