ఓటరు జాబితా సవరణ లో భాగంగా వచ్చిన అభ్యంతరాలన్నింటిని వేగవంతంగా పరిష్కరించాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయం లో జిల్లాలోని 9 మండలాలు మరియు గంగారం, కొత్తగూడ ఎన్నికల అధికారులతో ఓటరు జాబితాలోని డబల్ ఎంట్రిలపై తీసుకున్న చర్యలపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా జిల్లాలోని క్లస్టర్ల వారిగా ఓటరు జాబితాలలోని డబుల్ ఎంట్రిలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు,ఫిర్యాదులు పరిష్కరించినవి, ఇంకా పెండింగ్లో ఉన్నవి, పోలింగ్ కేంద్రం, మండలాల వారిగా సమర్పించాలని ఆదేశించారు.
ఓటరు జాబితా సవరణలో భాగంగా ఓటరు నమోదు, సవరణపై నిర్వహించిన ప్రత్యేక ప్రచార దినోత్సవాల సందర్భంగా వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదుల పై సైతం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, జెండర్ రేషియో, 18- 19 సంవత్సరాల మధ్య వయసున్నవారు ఓటరు గా నమోదు చేసుకోవడం, ఓటరు అవగాహన కార్యక్రమాలు, జనాభా ప్రకారం 18 సంవత్సరాల వయస్సున్నవారు ఓటరు గా నమోదు శాతాన్ని పెంచాలని చెప్పారు.
అలాగే గిరిజన, చెంచు ఓటర్ల నమోదు, 80 సంవత్సరాల పైగా ఉన్న వారి ఓటు వివరాలు, దివ్యాంగులు, థర్డ్ జెండర్, సెక్స్ వర్కర్ల ఓటరు నమోదు పై దృష్టి సారించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ఏ ఈఆర్వోలు తనిఖీ చేయాలని, ఓటరు గుర్తింపు కార్డుల ప్రింటింగ్ పై దృష్టి సారించాలని, ఓటరు అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్డీఓ కే. సత్య పాల్ రెడ్డి, ఏఈఆర్వోలు, డి టి లు, సీనియర్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గోన్నారు.