వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఎన్నికల కోలాహలం ఊపందుకోగా.. ఓటర్ల నమోదు ప్రక్రియ మొదటి కొచ్చింది. 2015లో రూపొందించిన ఓటర్ల జాబితాను పక్కనపెట్టేశారు. తాజాగా ఓటర్ల జాబితా రూపొందించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఇందుకు ఈ ఎమ్మెల్సీ స్థానంలో ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా తాజాగా రూపొందించాలని ఆదేశించింది. అర్హులైన పట్టభద్రులంతా ఈ ఎన్నికల కోసం మళ్లీ ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.
దీంతో పాత తరం ఓటర్లలో కొంత నిరుత్సాహం ఏర్పడుతోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఎలక్టోరల్ రోల్ అధికారిగా నల్గొండ డీఆర్వో
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓటర్ల జాబితా రూపొందిచేందుకు ఎలక్టోరల్ రోల్ అధికారిగా నల్గొండ డీఆర్వో వ్యవహరిస్తారు. నియోజకవర్గం పరిధిలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు సహాయ ఎలక్టోరల్ రోల్ అధికారులుగా పనిచేస్తారు.
ఓటు నమోదుకు ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్లో ఓటు నమోదుకు పోర్టల్ అందుబాటులోకి రానుంది. సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లోనూ ఓటు నమోదు దరఖాస్తులను అందించే అవకాశం కల్పిస్తారు.
ఓటు నమోదుకు ఫారం-18లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు ఆన్లైన్లో, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులోకి తెస్తారు. 2017 అంతకు ముందు డిగ్రీ పూర్తి చేసిన వారు ప్రొవిజనల్ సర్టిఫికెట్ లేదా మార్కుల ధ్రువీకరణ పత్రం లేదా డిగ్రీ పట్టా జిరాక్స్ పత్రాలు దరఖాస్తుకు జత చేయాలి.
ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు జత చేయాల్సి ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఓటర్ల జాబితా రూపొందించిన అనంతరం పోలింగ్ కేంద్రాలను నిర్ణయిస్తారు. గత ఎన్నికల్లో 400 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు.
ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ మేరకు..
1.11.2020 నాటికి డిగ్రీ, ఇంజినీరింగ్ సహా తత్సమానమైన విద్య పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు అర్హులు. అంటే 2017లో అంతకుముందు డిగ్రీ, ఇంజినీరింగ్ సహా తత్సమానమైన విద్య పూర్తి చేసిన వారు ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అక్టోబర్ 1న ఓటరు నమోదుకు నోటీస్ జారీ చేస్తారు.
అక్టోబర్ 1 నుంచి నవంబరు 6 వరకు ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు
ముసాయిదా ఓటర్ల జాబితాను 25.11.2020 నాటికి రూపొందిస్తారు.
డిసెంబరు 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు.
డిసెంబర్ 1 నుంచి 31 తేదీ వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు.
12 జనవరి 2021 తేదీ నాటికి అభ్యంతరాలు పరిష్కరిస్తారు
18 జనవరి 2021న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. (ఈ ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారు)