డబ్బులు ఇవ్వందే సినిమా పూర్తి కాదు అంటున్న ఆర్జీవీతో ఎలా డీల్ చేయాలా అనేది జగన్ కు అర్ధం కావడం లేదు. జగన్ ను హీరోను చేస్తూ ఆయన తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన నాటి సంఘటనలు గుర్తు చేస్తూ ఆర్జీవీ వ్యూహం అనే సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జగన్ ను హీరోగా చూపించడంతో బాటు చంద్రబాబునాయుడిని విలన్ గా చూపించాలనేది ఆర్జీవీ వ్యూహం.
చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమాలు తీయడం, వాటిని ఎన్నికల ముందు విడుదల చేయడం ఆర్జీవీ చాలా కాలంగా ఒక పెద్ద వ్యాపారంగా చేస్తున్నారు. ఆర్జీవీ లాంటి వ్యక్తుల్ని చంద్రబాబునాయుడు దగ్గరకు కూడా రానివ్వరు. అందుకని ఆ కసి మనసులో పెట్టుకుని చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా సినిమాలు తీయడం ఆర్జీవీకి అలవాటు.
చాలా మందితో డీల్ చేసిన విధంగానే ఆర్జీవీ ఏపి సీఎం జగన్ తో కూడా డీల్ కుదుర్చుకున్నారు. గత ఎన్నికల సమయంలో ఆర్జీవీ రెండు సినిమాలు తీసి విడుదల చేశారు. అవి ఒక్క షో కూడా నడవనంత ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. అయినా ఆ సినిమాల కారణంగా ఆర్జీవీకి కలెక్షన్లు భారీగా ముట్టాయి. అదే ఒరవడి ఈ సారి కూడా కొనసాగించేందుకు ఆయన వ్యూహం పన్నారు.
అందులో భాగంగానే ఈ సారి జగన్ ను హీరోగా చూపించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తండ్రి మరణం సందర్భంగా ముఖ్యమంత్రి సీటు కోసం సంతకాలు సేకరించారనే పేరు జగన్ కు ఎక్కువగా ఉన్నది. దాన్ని తుడిచి పెట్టేందుకు ఆర్జీవీ వ్యూహం రూపొందించారు. తండ్రి మరణంతో ఆయన ఎంత మనస్థాపం చెందింది చూపించడం ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యం.
అయితే డ్రామా పండించే నెపంతో చంద్రబాబునాయుడిని విలన్ గా చూపించడం అలవాటు చేసుకున్న ఆర్జీవీ ఈ సినిమాలో కూడా అదే చేస్తున్నారని సినీ వర్గాల టాక్. తండ్రి చనిపోతే జగన్ బాధపడ్డట్టు, చంద్రబాబు సంతోషించినట్లు ఈ సినిమాలో చిత్రీకరించారని చెబుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు, రాజశేఖరరెడ్డి, గులాంనబీ ఆజాద్, కే ఈ కృష్ణమూర్తి ఎంతో మంచి స్నేహితులు. చంద్రబాబు, రాజశేఖరరెడ్డి అయితే ఒకే సారి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి వర్గంలో కూడా పని చేశారు.
ఆ తర్వాత ఇద్దరి దారులు వేరైనా పార్టీల పరంగా తప్ప వ్యక్తిగతంగా చంద్రబాబు, రాజశేఖరరెడ్డి, గులాంనబీ ఆజాద్ లు దూషించుకోలేదు. రాజశేఖరరెడ్డి ఆర్ధికంగా కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు సహాయం చేశారని కూడా చెబుతుంటారు. అయితే ఈ విషయాలు చాలా మందికి తెలియవు. ఈ ఒక్క లాజిక్ ను క్యాష్ చేసుకోవడానికి ఆర్జీవీ ప్రయత్నిస్తున్నారు.
రాజశేఖరరెడ్డి మరణ వార్త వెలువడిన వెంటనే చంద్రబాబు సంతాపం వ్యక్తం చేయడమే కాకుండా ఆయన మృతదేహం తీసుకువచ్చినప్పుడు స్వయంగా వెళ్లి నివాళి అర్పించారు. రాజశేఖరరెడ్డి మృతదేహం ఉన్న చోటుకు వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. తన మిత్రుడిని కడసారి చూడాల్సిందేనని చంద్రబాబు వెళ్లి నివాళి అర్పించి అక్కడ కన్నీటి పర్యంతం అయ్యారు. వాస్తవాలను మరుగుపరిచి సినిమాటిక్ గా తీసే ఆర్జీవీ తన ఈ సినిమాలో ఎప్పటిలాగే చంద్రబాబును విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్జీవి డెన్ స్టూడియోస్తో కలసి రామదూత క్రియేషన్స్ అధినేత దాసరి కిరణ్ కుమార్ ‘ వ్యూహం ’ సినిమా నిర్మిస్తున్నారు.
రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ‘వ్యూహం’ సినిమాలోని మొదటిపాటను విడుదల చేశారు. ఈ పాటకు సంగీతాన్ని అందించి పాడింది కీర్తన శేష్. ఈ పాటకు లిరిసిస్ట్ రాజశేఖర్. ‘వ్యూహం’ సినిమా దాదాపు 80శాతం షూటింగ్ పూర్తయింది. అయితే మిగిలిన సినిమా పూర్తి చేయడానికి డబ్బులు అవసరమని ఆయన అడినట్టు చెబుతున్నారు.
అయితే ఇప్పటికే ఇచ్చింది చాలా ఎక్కువని భావిస్తున్నవారు అందులోనే పూర్తి చేయాలని చెబుతున్నారట. దాంతో సినిమా నిర్మాణంలో జాప్యం జరుగుతున్నట్లు అంటున్నారు. ఈ చిత్రంలో వై.యస్ జగన్గా అజ్మల్ వైయస్.భారతీ పాత్రలో మానస నటిస్తున్నారు.