పట్టణ ప్రగతి, పట్టణ అభివృద్ధి, ప్రజాక్షేమం అన్నమాటలు వినటానికి గొప్పగానే ఉంటాయి. దేవాలయం అంటే మానసిక ప్రశాంతతకు నిలయం.అటువంటి ఆలయం ప్రాంగణం ముందు అంత బురద నీటితో,చెత్తా చెదారంతో నిండి పోయి చిన్నపాటి తటాకాన్ని తలపిస్తుంది ఈ రహదారి.
ఈ ఆలయ కమిటీకి చెందిన ఓ వ్యక్తి ప్రజా ప్రతినిధిగా కోనసాగుతున్నా ఇక్కడ సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కానీ సమస్యను తీర్చిదిద్దే పరిస్థితి లేదని భక్తులు తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆరోపిస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాల్టీ పరిధిలోని శ్రీసాయి బాబా ఆలయం ముందు ఉన్న దుస్థితి ఇది.
పరిస్థితి ఇలా ఉంటే సీజనల్ వ్యాధులు ఎందుకు సంభవించవు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక వంక సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురుగు నీరు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి అని లెక్చర్లు దంచుతూ మరొక ప్రక్క నగరం గుంతల మయంతో మురుగు నీరుతో రహదారులు దర్శనమిస్తుంటే పట్టించుకునే వారే కరువైనారు.
ప్రజా పాలకులు ఏమయినారు? ప్రజాభివృద్ధి ఏమైంది? ప్రజల ఆరోగ్య స్థితిగతులు పట్టించుకునే నాథుడు లేడా? హే భగవాన్ మా మొర ఆలకించి ప్రజా పాలక, అధికారులకు కనువిప్పు కలిగించి, మా జీవనం సుఖమయంగా సాగాలంటే ఈ సమస్యను పరిష్కరించే విధంగా చూడు తండ్రీ అని ప్రజలు వేడుకుంటున్నారు.